టీమ్ ఇండియాకు గ్రాండ్ వెల్కమ్!

T20 World Cup 2026: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో భారత క్రికెటర్లకు, బీసీసీఐ అధికారులకు విందు ఇచ్చారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్ కోసం జట్టు ప్రస్తుతం రాజధానిలో ఉంది.

ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న గంభీర్ నివాసానికి టీమ్ బస్సులో ఆటగాళ్లు చేరుకున్నారు. గంభీర్ తన భార్య నటాషా జైన్, కుమార్తెలు ఆజీన్ మరియు అనైజాతో కలిసి ఆటగాళ్లకు సాదర స్వాగతం పలికారు. ఈ విందుకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా హాజరయ్యారు. విశేషమేమిటంటే, ప్రస్తుత జట్టులో ఢిల్లీకి చెందిన ఆటగాడు ఒక్కరు కూడా లేరు. లోకల్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు.

తమ తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్, ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. బౌలింగ్‌లో మొహమ్మద్ సిరాజ్ మొదటి స్పెల్‌లోనే మూడు వికెట్లు తీసి అమెరికాను కోలుకోకుండా చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌ను టీమ్ ఇండియా రద్దు చేసుకుంది. నమీబియాతో మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో, ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ గంభీర్ ఈ విందు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు త్వరలోనే తిరిగి మైదానంలో చెమటోడ్చనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story