T20 World Cup 2026: భారత్ కోట బద్ధలు.. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

T20 World Cup 2026: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ను 50 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడించిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా సరికొత్త రికార్డు సృష్టించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ప్రోటీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో, భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. గతంలో 2010లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన 49 పరుగుల ఓటమే టీ20 ప్రపంచకప్లో భారత్కు ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద ఓటమి. ఇప్పుడు ఆ రికార్డును దక్షిణాఫ్రికా చెరిపివేసింది.
మొత్తంగా టీ20 ఫార్మాట్లో పరుగుల పరంగా భారత్కు ఇది రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. 2019లో వెల్లింగ్టన్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది, అది ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత, పొట్టి ప్రపంచకప్లో భారత్కు ఇదే మొదటి ఓటమి. అలాగే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత, ఐసీసీ టోర్నీల్లో భారత్ ఓడిపోవడం మళ్లీ ఇప్పుడే జరిగింది.

