Team India all-rounder Axar Patel: టీమిండియా ఆల్‌‌‌‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. దీంతో సెలెక్షన్ కమిటీ అతని స్థానంలో ఆల్‌‌‌‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌‌‌‌ను జట్టులోకి తీసుకుంది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా ఆడలేదు. అక్షర్ ప్రస్తుతం లక్నోలో జట్టుతోనే ఉండగా.. టీమ్ డాక్టర్లు అతడిని పర్యవేక్షిస్తున్నారని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.

అక్షర్ పటేల్ స్థానంలో ఎంపికైన 31 ఏండ్ల షాబాజ్ అహ్మద్ ఇటీవల రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో నిలకడగా రాణించాడు. షాబాజ్ ఇది వరకు ఇండియా తరఫున రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడాడు. కాగా, తన కుటుంబంలో ఒకరు హాస్పిటల్‌‌‌‌లో చేరిన కారణంగా స్టార్ పేసర్ జస్‌‌‌‌ప్రీత్ సౌతాఫ్రికాతో మూడో టీ20కి దూరమై ఇంటికి వెళ్లాడని తెలుస్తోంది. అన్నీ సజావుగా జరిగితే బుమ్రా బుధవారం జరిగే నాలుగో టీ20 లేదా ఐదో మ్యాచ్ కోసం జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ముగియగా. ఇందులో ఇండియా రెండు, సౌతాఫ్రికా ఒకటి గెలిచాయి. ఇంకా రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. లక్నో, అహ్మదాబాద్‌లలో ఈ రెండు మ్యాచులు జరగనున్నాయి.

Next Story