టీమిండియా దుబాయ్ వచ్చి ట్రోఫీ తీసుకోవాలి

Unyielding Naqvi: ఆసియా కప్ ట్రోఫీని గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ట్రోఫీని అప్పగించే విషయంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ కూడా) తన వైఖరిని మార్చుకోవట్లేదు.

ఆసియా కప్ విజేతలైన టీమిండియా కెప్టెన్,ఆటగాళ్లు దుబాయ్‌కు వచ్చి తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవాలని మొహ్సిన్ నఖ్వీ పట్టుబడుతున్నారు. ట్రోఫీని నేరుగా భారత్‌కు పంపడానికి ఆయన నిరాకరిస్తున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ బోర్డులు కోరినప్పటికీ, ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

నవంబర్ 10న దుబాయ్‌లో ఒక ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేసి, భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లు బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా హాజరై ట్రోఫీ తీసుకోవాలని ఏసీసీ బీసీసీఐకి లేఖ ద్వారా తెలియజేసింది.

వివాదానికి కారణం

ఆసియా కప్ ఫైనల్ (భారత్ vs పాకిస్తాన్) అనంతరం టీమిండియా ఆటగాళ్లు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారు.దీంతో నఖ్వీ ఆ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచారు.

ట్రోఫీని వెంటనే సరైన పద్ధతిలో అప్పగించకపోతే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని బీసీసీఐ నఖ్వీని హెచ్చరించింది.

మొత్తంగా, ట్రోఫీని నేరుగా తీసుకువెళ్లడానికి భారతదేశం నిరాకరించడం, దానిని స్వయంగా తీసుకోవడానికి దుబాయ్‌కి రావాలని నఖ్వీ పట్టుబట్టడం ఈ వివాదం కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story