Majumdar: ఆసియా కప్‌ను భారత మహిళల జట్టు సొంతం చేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్పును గెలుచుకుని అదరగొట్టింది. అయితే.. జట్టు ఫీల్డింగ్ మాత్రం కొంత ఆందోళన కలిగించింది. ముఖ్యంగా క్యాచులు జారవిడవడం టీమ్‌కు పెద్ద మైనస్‌గా మారింది.

ఐదు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఏకంగా 13 క్యాచులను వదిలేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో భారత్‌ తర్వాత ఇండోనేషియా ఉంది. ఆ జట్టు ఏడు క్యాచులను జారవిడిచింది. దీంతో ఆసియా కప్ గెలిచినా.. భారత మహిళల ఫీల్డింగ్‌పై విమర్శలు వచ్చాయి.

ఈ అంశంపై జట్టు కోచ్ మజుందార్ స్పందించాడు. ఫీల్డింగ్‌లో ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని ఆయన అంగీకరించాడు.

“అవును.. ఫీల్డింగ్‌లో మేం ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. కొన్ని క్యాచులు వదిలేసినప్పటికీ.. ఓవరాల్‌గా మా ఫీల్డింగ్ బాగానే ఉంది. అయితే ఈ విషయంలో మరింత దృష్టి పెట్టి కష్టపడతాం. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తాం. ఇంకా మెరుగ్గా మారేందుకు నిజాయతీగా ప్రయత్నిస్తాం” అని మజుందార్ చెప్పాడు.

ఇక జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్‌పైనా వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించాడు. అక్కడి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని తెలిపాడు. మిడిలార్డర్ విషయంలో తమకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశాడు.

“మిడిలార్డర్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేం మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాం. షఫాలీ, స్మృతి మంధాన కూడా చాలా బాగా ఆడారు. ప్రతి బ్యాటర్ తప్పనిసరిగా పరుగులు చేయాలనే లేదు. టీ20 క్రికెట్‌లో కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. ఓపెనర్లు దూకుడుగా ఆడతారు. కొన్నిసార్లు ఫినిషర్లు మ్యాచ్‌ను ముగిస్తారు” అని వివరించాడు.

Next Story