ఇవాళ ఐపీఎల్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో గెలిచి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్పై అందరి ఫోకస్ ఉండనుంది. లీగ్ దశలో తలపడ్డ మ్యాచ్ల్లో ఇరు జట్లూ చెరోసారి నెగ్గగా.. క్వాలిఫయర్–1లో ఆర్సీబీ గెలిచింది. గత రెండు పరాజయాలకు ఫైనల్లో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకొని కప్పు సొంతం చేసుకోవాలని అయ్యర్సేన కోరుకుంటోంది.
సొంతగడ్డపై క్వాలిఫయర్–1లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఘోర ఓటమి నుంచి అయ్యర్ కెప్టెన్సీలోని కింగ్స్ గొప్పగా పుంజుకుంది. క్వాలిఫయర్– 2లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించి 11 ఏండ్ల తర్వాత ఫైనల్ చేరుకుంది. పాయింట్ల పట్టికలో తరచుగా సెకండాఫ్లో నిలిచే కింగ్స్ ఈ సారి కెప్టెన్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలో సంచలన మార్పు సాధించింది. లీడర్గానే కాకుండా బ్యాటర్గానూ అయ్యర్ (603రన్స్) జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గత పోరులో ముంబైపై అతని బ్యాటింగ్ అద్భుతమనే చెప్పొచ్చు. ప్రభ్సిమ్రన్, జోష్ ఇంగ్లిస్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్ బ్యాటింగ్లో అయ్యర్కు తోడుగా ఉన్నారు.
ఈ సీజన్లో పంజాబ్ విజయాలకు ఆ టీమ్ టాపార్డరే పునాది అనొచ్చు. సీజన్ మధ్యలో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్తో పాటు టాప్–3లోని ప్రతీ ఒక్కరూ 160 ప్లస్ స్ట్రైక్ రేట్తో నిలిచారు. కానీ, వీళ్లను కట్టడి చేసిన ఏకైక టీమ్ ఆర్సీబీనే. బెంగళూరు పేసర్లు తమ హార్డ్ లెంగ్త్ బాల్స్తో పంజాబ్ టాపార్డర్ను 53/4, 76/4, 38/4 స్కోర్లతో దెబ్బకొట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఆర్సీబీతో 3 మ్యాచ్ల్లో 7, 6, 2 స్కోర్లు మాత్రమే చేశాడు. ఫైనల్లో ఆర్సీబీ బౌలింగ్ దాడిని బ్యాటర్లు సమర్థవంతంగా తిప్పికొడితేనే పంజాబ్ తన లక్ష్యాన్ని అందుకోగలదు. ఫ్లాట్ పిచ్పై గత పోరులో ముంబైని కట్టడి చేసిందనే చెప్పొచ్చు. కానీ, ఆర్సీబీపై అర్ష్దీప్ నేతృత్వంలోని పేస్ విభాగం ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. చేతి వేలి గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ చాహల్ గత పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, తన మాజీ ఫ్రాంచైజీపై చాహల్ నుంచి పంజాబ్ మెరుగైన పెర్ఫామెన్స్ ఆశిస్తోంది.
పిచ్ ఎలా ఉంది?
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఫైనల్ ఎర్ర, నల్ల మట్టితో కూడిన సెంటర్ వికెట్పై జరగనుంది. ఇక్కడ ఎనిమిది మ్యాచ్ల్లో 11 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆరుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే నెగ్గాయి. ఇక, మంగళవారం రాత్రి వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. రిజర్వ్ డే ఉంది.
