RCB:ఆదివారం కాకుండా బుధవారమే ఎందుకు ఆర్సీబీ విజయ పరేడ్ నిర్వహించారు?
బుధవారమే ఎందుకు ఆర్సీబీ విజయ పరేడ్ నిర్వహించారు?

RCB:2025 ఐపీఎల్ ట్రోఫీ విజయాన్ని అభిమానులతో కలిసి జరుపుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లాన్ చేసుకున్న వేడుక కాస్త విషాదకరంగా ముగిసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న క్షణం నుండి బెంగళూరు వీధులన్నీ అనందంతో ఉన్నాయి. అభిమానులు తమ అభిమాన జట్టు విజయాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కవాతు ఉంటుందని తెలిసిన వెంటనే, ఉదయం నుండి లక్షలాది మంది అభిమానులు స్టేడియం చుట్టూ గుమిగూడారు. అభిమానుల భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున బుధవారం ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని ఆర్సిబి బోర్డు, కర్ణాటక ప్రభుత్వాన్ని కోరినట్లు పోలీసులు తెలిపారు. విజయోత్సవ వేడుకను ఆదివారంకి వాయిదా వేయాలని పోలీసులు ఆర్సిబికి సూచించారు, అయితే, ఆర్సిబి బోర్డు ఆ సూచనను తిరస్కరించింది. ఆర్సిబి బుధవారం దానిని నిర్వహించాలని పట్టుబట్టిందని.. జట్టు విదేశీ ఆటగాళ్ళు ఆదివారం నాటికి తమ దేశాలకు వెళ్లిపోతారని వాదించారని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. "బుధవారం వేడుకను నిర్వహించవద్దని మేము మంగళవారం రాత్రి నుండి ప్రభుత్వం, ఆర్సిబి యాజమాన్యాన్ని హెచ్చరించాము. ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిదని మేము సలహా ఇచ్చాము. ఊరేగింపుకు బదులుగా, స్టేడియం లోపల ఒకే చోట ఒక క్రమబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆటగాళ్లను తీసుకువచ్చి వేడుకను పూర్తి చేయాలని మేము చెప్పాము" అని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.
