తెలుగు సినిమా తెరవేల్పు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగాబుధవారం ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నక్లెస్ రోడ్డు లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన మనవలు, దివంగత నందమూరి హరికృష్ణ కుమారులు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి, నమస్కరించి ఎన్టీఆర్కు అంజలి ఘటించారు. ఘాట్ వద్ద కాసేపు కూర్చుని తాతను తలచుకుని ఆయనతో తమ అనుభవాలను నెమరు వేసుకున్నారు. సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. నేడు ఎన్టీఆర్ 102వ శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబసభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వోద్యోగులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Next Story