మిస్ ఇంగ్లాడ్ మిల్లా మ్యాగీ వ్యవహరంపై ముగిసిన విచారణ

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ స్పందిస్తూ మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీపై ప్రభుత్వ విచారణ పూర్తయ్యిందని అయితే ఆమెపై తెలంగాణ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదని తెలిపారు. కానీ మిస్ వరల్డ్ నిర్వాహకులు ఆమెపై లండన్ లో కేసు వేశారని చెప్పారు. యూకే ప్రభుత్వమే మ్యాగీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని జయేష్ రంజన్ అన్నారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ వ్యక్తిగత కారణాలను చూపించి మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకుని లండన్ వెళ్ళిపోయారు. అక్కడ ది సన్ అనే టాబ్లాయిడ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మిస్ వరల్డ్ నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నప్పుడు అక్కడ స్పాన్సర్స్, బడా పారిశ్రామికవేత్తలకు చెందిన వ్యక్తులు కంటెస్టెంట్లను వ్యభిచారుల్లా చూశారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. లండన్ పత్రికలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే మిల్లా మ్యాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఖండించారు. తల్లి ఆనారోగ్యంగా ఉందని అందుకే తాను పోటీల నుంచి వైదొలుగుతానని మిల్లా మ్యాగీ అభ్యర్ధించిందని జూలియా తెలిపారు.
