ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్ పై మరో బాంబు పేల్చింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో కలసిన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత తన అభిప్రాయలను విస్పష్టంగా వెల్లడించారు. లిక్కర్ కేసులో నేను అరెస్ట్ అయినప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానంటే వద్దని వారించారని, నిజామాబాద్ లో నువ్వు ఉండాల్సిందే అక్కడ ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు అక్కడ సపోర్ట్ చేయలేదని నాకు ఆలశ్యంగా తెలిసిందని కేసీఆర్ తనతో చెప్పినట్లు కవిత అన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు. పార్టీ సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేశారన్నారు. నా జోలికి వస్తే బాంగుండదని హెచ్చరించారు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ని నడిపించే అంత పెద్ద వాళ్లా మీరు అని కవిత నిలదీశారు. నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందే అన్నారు. నేను వాళ్ళలా చిచోరా పనులు చెయ్యనని హుందాగా ఉంటానన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నప్పుడు వారిని ఎందుకు పక్కన పెట్టడం లేదని కవిత అడిగారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాన్నారు. కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసిఆర్ నోటీసులు ఇస్తే బీ ఆర్ ఎస్ పార్టీ నేతలు స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు పార్టీ నుంచి నిరసనలు తెలపలేదు, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కవిత స్పష్టం చేశారు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని, కేసీఆర్ కు నన్ను దూరం చేయాలని చూస్తున్నారని, నన్ను నా తండ్రికి దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు అని కవిత నర్మగర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదని, ఆ పార్టీ మునిగిపోయే నావలాంటిదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిన్న మహానాడు లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు అని చెప్పారు... అదే చంద్రబాబు గతంలో సీయంగా ఉన్నప్పుడు అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని కవిత గుర్తు చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ అంశం పై మరోసారి తెలంగాణ జాగృతి తో రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated On 29 May 2025 12:24 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story