CM Revanth Reddy: తన ఇరవై ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని జీవితంలోని ప్రత్యేక అధ్యాయంగా అభివర్ణించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో భావోద్వేగ పోస్ట్ చేసి, తన రాజకీయ ప్రస్థానం గురించి హృదయపూర్వకంగా తెలియజేశారు.

సాధారణ రాజకీయ కార్యకర్తగా మధ్యతరగతి నుంచి ప్రారంభమైన తన ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం వెనుక ప్రజల అపారమైన విశ్వాసమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ 20 ఏళ్లలో ఎన్నో విజయాలు, అనేక సవాళ్లు, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం ఉన్నాయని వివరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించినట్లు చెప్పారు.

లక్షల అక్షరాలు రాసినా, కోట్ల పదాలు చెప్పినా ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో తనతోపాటు నడిచిన ప్రజలు, కార్యకర్తలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతాను. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా నా బాధ్యతను నిర్వర్తిస్తాను” అని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని భావోద్వేగంగా ప్రకటించారు.

ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో, ప్రజల మధ్య భారీ చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రత్యేకమైన ప్రయాణం.

PolitEnt Media

PolitEnt Media

Next Story