సరస్వతీ పుష్కరాల్లో 30 లక్షల మంది పుణ్య స్నానాలు

- పుష్కరాల్లో హుండీ ఆదాయం రూ. 2.83 కోట్ల
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడి
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పుష్కరాలకు 30.లక్షల మందికి పైగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారని కలెక్టర్ పేర్కొన్నారు. పన్నెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఈ సరస్వతీ పుష్కరాల్లో భక్తులు మొత్తం 2.83 కోట్ల రూపాయల కానుకలను హుండీలో సమర్పించారన్నారు. పుష్కరాలు ఏర్పాట్లు పై ప్రభుత్వ మార్గనిర్దేశకత్వంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా సరస్వతీ ఘాట్ వద్ద సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు రాహుల్ శర్మ వెల్లడించారు. అలాగే హారతి ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కాశీ పూజారులచే సరస్వతి నవరత్న మాలా హారతి నిర్వహించామని తెలిపారు. భక్తులు నది లోపలికంటా వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్లకు ఒక గజ ఈతగాళ్ళును పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు. సింగరేణి రెస్క్యూ టీము, ఎస్డీఆర్ఎఫ్, ఎన్దిఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు సెక్టార్లు, జోన్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణకు అధికారులను నియమించినట్లు తెలిపారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు ద్వారా భక్తులను ఘాట్ వరకు, ఘాట్ నుండి బస్ స్టాండ్, దేవాలయం సమీపం వరకు ఉచిత సేవలు అందించినట్లు చెప్పారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు ద్వారా వైద్య సేవలు అందించామన్నారు. వర్షం వల్ల అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. సరస్వతీ పుష్కరాల నిర్వహణ చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ అనుభవం రాబోయే గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అభిప్రాయపడ్డారు.
