మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరింది. బంగాళాకాతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచన చేసింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆవర్తనం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నంచి ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాల్లో కుండపోత వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే సోమవారం రాత్రి నుంచే ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షలు కురిశాయి. రానున్న రెండుమూడు రోజుల పాటు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకొల్లోలంగా మారే అవకాశం ఉందని అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Next Story