ప్రాజెక్టులో కేంద్రాన్ని భాగస్వామిగా చేర్చాలి

ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మూడో దశలో చేపట్టాలి

A. Revanth Reddy Urges: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సత్వరం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో బుధవారం సాయంత్రం జరిపిన సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన రెండో దశ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని, దాన్ని త్వరగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రోను విస్తరించడం అత్యవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. తొలి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా రెండు, మూడో దశల పనులు సులభంగా చేపట్టవచ్చని తెలిపారు.

రెండో దశలో 129 కిలోమీటర్ల పొడవున ఏడు కారిడార్లు నిర్మించాల్సి ఉందని, దీనికి సుమారు రూ.38,595 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా చేరి, కేంద్ర-తెలంగాణ సంయుక్త భాగస్వామ్యంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా మూడో దశ:

హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో మూడో దశ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ దశకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించామని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర సలహాదారు ఎన్‌.వి.ఎస్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story