మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి
కేంద్ర మంత్రి కుమార స్వామిని కోరిన సీయం రేవంత్

హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి కి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా హైదరాబాద్ నగరానికి 2వేల ఈవీ బస్సులు కేటాయించినందుకు కేంద్ర మంత్రి కుమారస్వామికి సీయం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే హైరదాబాద్ జనభా ఇప్పటికే కోటీ 30 లక్షలకు పైగా ఉందని, రోజు రోజుకూ దేశం నలు మూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్ధిరపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉందని అందువల్ల భవిష్యత్ అవసాలు దృష్టిలో పెట్టుకుని మరో 800 ఈవీ బస్సులు హైదరబాద్ కు కేటాయించాలని సీయం కేంద్ర మంత్రిని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని సీయం కేంద్ర మంత్రి కుమారస్వామికి సూచించారు.
తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు.
