Another new update in Bhu Bharati

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు లోకి తీసుకు వచ్చిన భూ భారతి పోర్టల్లో మరో కొత్త అప్డేట్ చేర్చారు. మొదట్లో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో పనిచేసిన భూ భారతి పోర్టల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో, పలు ప్రాంతాల్లో భూ భారతి సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే, భూ భారతి పోర్టల్లోనే కొత్తగా 'భూ మిత్ర' అనే సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భూ మిత్రతో రైతులు తమ సందేహాలను వెబ్సైట్లోనే నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. భూ భారతి పోర్టల్ ఆధారంగానే ఇప్పుడు తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సహా పలు సర్వీసులు అందుతున్నాయి. ఇప్పుడు భూ మిత్ర ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా సర్వీసులను పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆప్షన్ ద్వారా రైతులు గానీ, ఇతర యూజర్లు గానీ.. భూ భారతి పోర్టల్లో అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానం వచ్చేస్తుంది. ఈమేరకు ఆ చాట్బాట్ను రూపొందించారు. రైతులు ప్రాథమికంగా సమాచారం ఇచ్చి.. తమ సందేహాలను అడిగితే భూ మిత్ర చాట్ బాట్ సందేహాలను నివృత్తి చేసిందని ప్రభుత్వం పేర్కొంది.
భూ మిత్ర సర్వీసులు పొందాలనుకునే వారు.. మొదటగా.. https://bhubharati.telangana.gov (తెలంగాణ భూ భారతి) వెబ్ సైట్ లోకి వెళ్లాలి. మెయిన్ పేజీ పేజీలో చివర్లో కనిపించే భూమిత్ర ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వా ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఇన్బిల్ట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అవి కాకుండా వేరే ప్రశ్నలు ఉన్నా.. చాట్బాట్లో అడగొచ్చు. టైప్ చేసి సెండ్ చేస్తే... వెంటనే సమాధానం ఇస్తుంది. తద్వారా భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వంటి పలు వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. వీటి ఆధారంగా సులభంగా భూముల వివరాలను తెలుసుకోవచ్చు. భూ భారతి పోర్టల్ సమస్యలు, ఎంక్వైరీ కోసం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. భూ భారతి పోర్టల్లో తలెత్తే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా 9140 - 29313999 నెంబర్ ను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య భూ భారతి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అవసరమైన సర్వీసులను పొందవచ్చు.
