భారీ ఊరట

Bandi Sanjay: హైకోర్టులో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సోమవారం 2021 నవంబర్ లో బండి సంజయ్పై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కొట్టివేసింది. 2021లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని సూర్యాపేట జిల్లా పెన్ పహాడు తహసీల్దార్ శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్పహాడ్ పోలీసులు బండి సంజయ్పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆయన ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించి వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు ఈ కేసులో ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసును సరైన సాక్ష్యాధారాల లేనందున కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
