Bathukamma Kunta: హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సెప్టెంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని హైడ్రా కమిషనర్ రంగనాత్ తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చెరువును పునరుద్ధరిస్తున్నామని, ఎక్కడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా రూ.7.40 కోట్లతో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. 5 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. 1962–63 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో ఉండగా, బఫర్ జోన్‌తో కలిపి 16 ఎకరాల 13 గుంటలు ఉండేది. కాలక్రమంలో ఆక్రమణల కారణంగా ఇది క్షీణించి, తాజా హైడ్రా సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలుగా గుర్తించబడింది. ఈ స్థలంలో చెరువును పునరుద్ధరించి అభివృద్ధి చేశారు.

ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఇక్కడే నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ లక్ష్యంతో హైడ్రా అన్ని పనులను పూర్తి చేసింది. గతంలోని బతుకమ్మ కుంటతో పోలిస్తే, ప్రస్తుతం దీని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story