బకాయిలు త్వరలో చెల్లిస్తాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను మానవీయ దృక్కోణంతోనే పరిష్కరిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన మూడు డీఏ (డియర్‌నెస్‌ అలవెన్స్‌) బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని శాసనసభలో ఆయన తెలిపారు.

గత ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో రిటైర్మెంట్ వయసు పెంచాల్సి వచ్చిందని, దీంతో ప్రస్తుత ప్రభుత్వంపై అదనపు భారం పడిందని భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం రూ.40,154 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, ఇందులో ఉద్యోగులకు సంబంధించిన రూ.4,571 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.

"సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తాం. మానవీయ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం. అలాగే ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు అందిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తోందని, గతంలో పేరుకుపోయిన సమస్యలను క్రమంగా పరిష్కరిస్తున్నామని భట్టి విక్రమార్క విశదపరిచారు. ఉద్యోగులు బకాయిల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం బాధ్యతగా వాటిని తీరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story