CM Revanth Reddy: బోనస్తో 7 రకాల సన్న వడ్లు అందుబాటులోకి తేవాలి: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ధాన్యం దిగుబడి పై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రైతు వేదికల్లో విత్తనాలు సులభంగా అందుబాటులో ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలని ఆదేశించారు.
ఈరోజు మంగళవారం హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
బోనస్పై కీలక నిర్ణయాలు
బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ 7 రకాల సన్న వడ్లను సబ్సిడీపై అందించాలని మార్గనిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టును మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.
సాంకేతికత పెంపుదలకు ఆదేశాలు
వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింత పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఎక్కువగా వినియోగించాలని నిర్దేశించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా చేసుకొని సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు.
సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైలు, అగ్రికల్చర్ యూనివర్సిటీల మధ్య సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మార్క్ఫెడ్ నష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని, ఆయిల్ ఫెడ్ను బలోపేతం చేయాలని సూచించారు. అన్ని వ్యవసాయ మందులకు సంబంధించి ఒక యాప్ ఏర్పాటు చేయాలని, యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని స్పష్టం చేశారు. యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రంపై ఒత్తిడి
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు మొత్తం తెలంగాణకు అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం సూచించారు. ఎరువుల పరిస్థితి పై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వివరాలు అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- A. Revanth ReddyRevanth ReddyTelanganaFine PaddyPaddy FarmersFarmer WelfareAgricultureBonus SchemeCrop IncentivesAgricultural PolicyTelangana GovernmentFarmingRural DevelopmentFarmer SupportAgricultural NewsPolitical NewsCurrent AffairsLatest Telugu NewsTelangana PoliticsCrop CultivationFood SecurityFarmer BenefitsAgriculture Sector

