సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపిస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చేపిస్తున్న నిర్లక్ష్యంపై ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రైతాంగం తరపున ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపైనే కేసీఆర్ అధ్యక్షతన త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చ జరగే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడంపైన చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులకు కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతున్నది. రాజకీయ దురుద్దేశంతోనే అన్నదాతలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న నేపద్యంలో తదుపరి కార్యాచరణ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
