కాంగ్రెస్లో కేబినెట్ ప్రకంపనలు - సీనియర్ల బుజ్జగింపులు
Cabinet turmoil in Congress - Seniors' appeasement

తెలంగాణలో కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శిబిరాల్లో సంతోషాలు అలుముకుంటే.. అవకాశం దక్కని ఆశావహులు అసంతృప్తిలో మునిగిపోయారు. దీంతో, అసంతృప్తులను బుజ్జగించడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తలకు మించిన భారంగా పరిణమించింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అలాగే, కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మంత్రిపదవి తనకే అని భావించారు. మొదటినుంచీ చివరి నిముషం దాకా వీళ్ల పేర్లే ఖాయమని చర్చ జరిగింది. లీకుల్లో కూడా ఈ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, కాంగ్రెస్పార్టీ అధిష్టానం వీళ్లకు ఊరించి ఉసూరుమనిపించింది. దీంతో, వీళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిణామాలతో అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లను రంగంలోకి దించింది.
మొదటినుంచీ ఊహించినట్లు కేబినెట్లో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. దీంతో, ఆదివారం ఉదయమే ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ తదితరులు సుదర్శన్రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్రావులు అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు... మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్రెడ్డి రంగారెడ్డి తో మాట్లాడేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారిద్దరూ అందుబాటులో లేకుండాపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్రెడ్డి రంగారెడ్డి ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్ పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
అలాగే, కరీంనగర్ జిల్లాకు చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రిపదవి ఖాయమని శనివారం రాత్రి వరకూ చర్చ జరిగింది. ప్రభుత్వ పెద్దల నుంచి కూడా కవ్వంపల్లికి సంకేతాలు అందాయి. కానీ, ఉదయానికి పరిస్థితి తారుమారైంది. కవ్వంపల్లికి బదులు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవి దక్కింది. దీంతో, కవ్వంపల్లి శిబిరంలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. కవ్వంపల్లికి మంత్రి పదవి ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరగ్గా.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో మంత్రి పదవి చేజారడంతో కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు సమాచారం.
