CM Revanth Reddy: భాజపా, బీఆర్‌ఎస్‌ పార్టీల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు వేర్వేరుగా కనిపించినా, వాటి లక్ష్యం ఒక్కటేనని స్పష్టం చేశారు.

ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) అంశంపై కొడంగల్‌ నియోజకవర్గం బీఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇలా అన్నారు:

“ప్రతి పేదవాడికి మంచి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. కొడంగల్‌లో నన్ను నేరుగా ఎదుర్కోలేక, కాంగ్రెస్‌కు ఓటు వేసినవారి ఓట్లను తొలగించాలని కుట్ర చేస్తున్నారు. ఇక్కడ దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయిలో నాకు సమస్య రాదని భావిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సుమారు 90 శాతం మంది కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. వారి ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొడంగల్‌లో 78 శాతం ఓటర్లు నమోదు అయ్యారు. మిగిలిన 22 శాతం ఓటర్లను కూడా త్వరగా నమోదు చేయాలి. బీఎల్‌ఏలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

బీఎల్‌వోలు ప్రభుత్వ అధికారులు కాగా, బీఎల్‌ఏలు పార్టీ కార్యకర్తలు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు. సరైన వివరాలు లేని వారిని పక్కన పెడతారు. అనుమానాస్పద కేసుల్లో సరైన ఆధారాలు చూపి ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయమవుతోంది. కొడంగల్‌లో అర్హులైన ఎవరి ఓట్లనూ తొలగించనివ్వకూడదు. ఈ నెలాఖరు నాటికి 100 శాతం SIR పూర్తి చేయాలి.

నాపై కుట్రలు చేసేవారిని మీరే ఎదుర్కొని దెబ్బతీయాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్‌ నేతలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story