నేడు, రేపు సీయం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్

- కేంద్రానికి బనకచర్లపై అభ్యంతరాలు తెలిపిన సీయం
- సీయంతో పాటు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్బాబు, ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలు తెలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. ఈ పర్యటనలో ముందుగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తోపాటు గ్లోబల్ ఛేంజ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం భేటీ అయ్యింది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సీయం బృందం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను మంత్రికి తెలియజేశారు. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్పించిన పీఎఫ్ఆర్ పై స్పందన తెలపాలని గతంలో కేంద్ర మంత్రి పాటిల్ తెలంగాణ రాష్ట్రాన్ని కోరారు. గురువారం నాడు జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ పీఎఫ్ఆర్ పై తెలంగణ రాష్ట్ర అభిప్రాయలతో కూడిన పూర్తి స్ధాయి నివేదికను కేంద్ర జలశక్తి మంత్రికి సీయం బృందం సమర్పించింది. గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలోనే ఉండనుంది. ఈ పర్యటనలో పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు, కేంద్ర నిధుల మంజూరు తదితర విషయాల్లో ఆయా శాఖల మంత్రులను సీయం కలవనున్నారు. అలాగే ఏఐసీసీ పెద్దలను కూడా కలసి చీఫ్ విప్, విప్, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కూడా ఉంది.
