బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి

ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళడం లేదని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. మంత్రివర్గ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంపై చర్చిస్తున్నారా లేక పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారా అని మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెపుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్రాన్ని అడిగి మేనిఫెస్టోలో పెట్లలేదు కదా అని మహేశ్వరరెడ్డి అడిగారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయలేకే స్థానిక సంస్ధల ఎన్నికలు ఈ ప్రభుత్వం నిర్వహించలేక పోతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్ధితుల్లో స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతు భరోసాకు రెండు సీజనలు ఎగనామం పెట్టి రైతులను మోసం చేశారన్నారు. రుణమాఫీ సైతం 65 శాతం మాత్రమే అమలు చేసి మిగిలిన వారిని మోసం చేశారన్నారు. రాజీవ్‌ యువ వికాశం పథకం కోరుతూ 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆ పథకం ఎందుకు అమలు చేయడం లేదని బీజేఎల్‌పీ నేత ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహేశ్వరరెడ్డి అడిగారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. చిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించకుండా ఎందుకు పెండింగ్‌ పెడుతున్నారని మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల కాలేజీలు మూతపడే దుస్ధితి నెలకొందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారాలన్నీ మంత్రివర్గ సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story