Deputy Chief Minister : కాంగ్రెస్ అంటేనే బహుళార్ధక సాధక ప్రాజెక్టులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీ అంటేనే బహుళార్ధక సాధక ప్రాజెక్టులు అని, ఈ దేశంలో, రాష్ట్రంలో నిర్మించిన అనేక సాగు నీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ప్రారంభించి పూర్తి చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి డిప్యూటీ సీయం పంట పొలాలకు సాగునీరు వదిలారు. పాలేరు రిజర్వాయర్ యూటీ పనులు పూర్తి చేసిన తరువాత రిజర్వాయర్ లోకి నీళ్లు వదిలడం రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, విత్తన భాండాగారంగా రూపొందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణిళకలు రచిస్తోందన్నారు. కృష్ణా నది ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించిందని డిప్యూటీ సీయం మండిపడ్డారు. నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరి చేస్తుంటే ఆ పార్టీ నేతలు బురద చల్లుతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించేందుకు అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీయం మల్ల భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
