తెలంగాణలో ప్రారంభమైన కాంగ్రెస్ మార్కు రాజకీయాలు

- సీనియర్లు... జూనియర్లకు మధ్య పెరుగుతున్న అంతరం
- అసంతృప్తితో రగిలి పోతున్న టీకాంగ్రెస్ సీనియర్లు
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు... ఇక అధికారంలో ఉందంటే ఎక్కడ లేని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటిస్తారు ఆ పార్టీ నాయకులు అందరూ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కావొస్తోంది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఇప్పుడిప్పుడే పార్టీలో సీనియర్లకు, జూనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రచ్చ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారింది. కొందరు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు జీవన్ రెడ్డి నియోజకవర్గం అంటేనే హడలిపోతున్నారు. అక్కడ సొంతపార్టీలో వర్గపోరులో తామెందుకు ఇరుక్కోవడం అనుకుని జగిత్యాలకు దూరంగా ఉంటున్నారు.
గత వారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముందే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చూసిన కాంగ్రెస్ నేతలకు పార్టీలో ఏం జరుగుతుందో అర్దంకాని అయోమయ పరిస్ధితి నెలకొంది. ఇక మీ రాజ్యం.. మీరే ఏలుకోండి.. అంటూ పొంగులేటి ముఖం మీదే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. పదేళ్ళ విరామం తరువాత కాంగ్రెస్ కు అధికారం చేతికొస్తే, అదేపార్టీలో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి అలా అనేశారేంటి, ఆయన అంతలా రగిలిపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తెంగాణ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి వీహెచ్ తరువాత అంతటి సీనియర్ నేత, ఆరు సార్లు ఎమ్మెల్యేగా , ఓసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు దండిగా ఉన్నా, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు జీవన్ రెడ్డికి మంటెక్కిస్తున్నాయి.
గత ఎన్నికల్లో తనకు ప్రత్యర్దిగా పోటీ చేసి గెలిచిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చు కోవడం జీవన్ రెడ్డికి రుచించలేదు. ఆ రోజు నుంచి జీవన్ రెడ్డికి కంటిమీద కునుకులేదంటే అతిశయోక్తికాదు. నా ప్రత్యర్దినే , నా అనుమతిలేకుండా కాంగ్రెస్లోకి ఎలా చేర్చుకుంటారని ఆయన రగిలిపోతున్నారు. పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన తనను కాదని, సంజయ్ను అందలం ఎక్కిస్తారా అంటూ జీవన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. రేవంత్ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో సీనియర్లను పట్టించుకోవడంలేదంటూ ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఇక జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆ సెగలు జగిత్యాలను రాజకీయలను మాత్రమేకాదు, ఏకంగా తెలంగాణ అంతటా వ్యాపిస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి సైతం జోక్యం చేసుకోవడానికి సాహసం చేయలేనంతలావివాదం ముదిరిపోయింది. జీవన్ రెడ్డి ఆవేదన రెవంత్ రెడ్డి కోటరీకి పట్టడంలేదని విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో రేవంత్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు మంత్రులు, సీనియర్లు జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకమవుతున్నారు. ఇటీవల జీవన్ రెడ్డిని కలసి మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, పార్టీ కోసం ఎంతో చేశారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వదులుకోదంటూ దామోదర రాజనర్సింహ మద్దతుగా మాట్లాడారు. ఇలా రేవంత్ వర్గం మంత్రులు జీవన్ రెడ్డికి అంటి ముట్టనట్లు ఉంటే, సీనియర్లు మాత్రం మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారట.
ఇలాంటి టైంలో తాను స్పందిస్తే రెండు వర్గాలుగా మారి పరిస్దితి మరింత చేయిదాటుందని భావించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బిఆర్ఎస్ నుంచి వస్తున్నారుగా రారమ్మంటూ సంజయ్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ప్రతిపక్షానికి షాకిచ్చామనే ఆనందం ఓవైపు, తీరా పార్టీలోకి వచ్చాక జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, జీవన్ రెడ్డితోపాటు సీనియర్ల నుంచి వస్తున్న విమర్శలు రేవంత్ కి తలనొప్పిగా మారాయట.
