Kaleswarm Project : హైకోర్టులో కేసీఆర్, హరీష్రావులకు నిరాశ
జస్టిస్ పిసీఘోష్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్న హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన విచారణ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావులు వేసిన పిటీషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇరువురి పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది. జస్టిస్ పీసీఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావులు వేసిన వేర్వేరు పిటీషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటీషన్లపై వాదనలు ముగిశాయి. దీని మధ్యంతర ఉత్తర్వుల అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీసీఘోష్ విచారణ నివేదికను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
