Minister Tummala: డ్రిప్ సేద్యం వేగవంతం చేయాలి.. రైతులకు అండగా నిలవాలి: మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల

Minister Tummala: తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఎల్-నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు.
ఎల్-నినో సవాళ్లకు డ్రిప్, తుంపర సేద్యమే పరిష్కార మార్గమని మంత్రి పేర్కొన్నారు. డ్రిప్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని కంపెనీలకు సూచించారు. పెండింగ్లో ఉన్న డ్రిప్ పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, బీఎంఎస్, బీఓక్యూలను పూర్తి చేసి వెంటనే అనుమతుల కోసం పంపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పరిపాలనా అనుమతుల్లో జాప్యానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
డ్రిప్ వ్యవసాయ పద్ధతిలో తక్కువ నీరు, విద్యుత్ ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు మైక్రో ఇరిగేషన్ కీలకమని అన్నారు. ఆయిల్పామ్ సాగుకు డ్రిప్ సదుపాయాలను వెంటనే కల్పించాలని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు. అవగాహన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గత రెండేళ్లలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.400 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. కంపెనీల పనితీరుపై జిల్లాల వారీగా నిరంతర సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సూక్ష్మ సాగునీటి విస్తరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.

