Minister Tummala Nageswara Rao: ఎల్నినో తీవ్రత.. రైతులకు రక్షణ కోసం ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం-వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Tummala Nageswara Rao: ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షపాతం తగ్గిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సన్నాహాలు చేయాలని సూచించారు.
సోమవారం వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్, సంచాలకుడు గోపి తో పాటు అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఎల్నినో ప్రభావంపై అగ్రివర్సిటీ చేసిన సూచనలను రైతులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ‘తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’ ద్వారా వాట్సాప్లో కచ్చితమైన, సమయోచిత వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను వెంటనే అమలు చేయాలి” అని అధికారులను ఆదేశించారు.

