Expectations are reversed - three sworn in as ministers

దాదాపు యేడాది కాలంగా ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. అయితే, ఈసారి కూడా పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగానే కేబినెట్‌ నియామకం పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి‌లకు లక్కీ ఛాన్స్ దొరికింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సరిగ్గా 12.19 నిమిషాలకు ముగ్గురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.



తాజా మంత్రి వర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, కరీంనగర్‌ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, నారాయణ పేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, గడ్డం వివేక్‌.. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాగా.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌.. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇక, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వారు. తాజా ప్రమాణ స్వీకారాలతో రేవంత్‌ కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది.



ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.



ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈయన ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రనాయక్‌కు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.


Politent News Web4

Politent News Web4

Next Story