Bandi Sanjay: నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నారని తెలిపారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. సీబీఐ ఇప్పటికే 17 మందిని, వారిలో 11 మంది ఫ్యాకల్టీ సభ్యులను అరెస్టు చేసినట్లు వివరించారు.

విద్యార్థుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పినట్లు చెప్పారు. 40 రోజుల్లోనే నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించి ఫలితాలు ప్రకటించడం ద్వారా విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసినట్లు తెలిపారు.

అయితే ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో మతతత్వ, కమ్యూనిస్టు శక్తులు అరాచకం సృష్టించాయని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంట్ పై దాడి కుట్ర, దేశ వ్యతిరేక నినాదాలు, పోలీసులు, జర్నలిస్టులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన జరిగాయని ఆరోపించారు. ఈ ఘటనల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని విచారం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం జరుగుతోందని, 480 అకౌంట్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. నీట్ పేపర్ లీక్‌కు ఆర్టికల్ 370 రద్దు, రాముడు, సీతమ్మ, సనాతన ధర్మం, పొరుగు దేశాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులెవరూ దేశద్రోహ నినాదాలు చేయరని, రాళ్లు విసరరని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించరని అన్నారు.

ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్, నీట్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్, ఇండియా కూటమి రాజకీయం చేస్తున్నాయని, ప్రధాని మోదీ, హోం, విద్యా మంత్రుల రాజీనామా డిమాండ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లోనూ పేపర్ లీకులు జరిగినప్పుడు ఆయా ప్రభుత్వాలు రాజీనామా చేయలేదని ఉదాహరణలు ఇచ్చారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఎంసెట్, టీఎస్‌పీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ పేపర్లు లీక్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నేతలను తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌పై వ్యంగ్యం వ్యక్తం చేశారు.

నీట్ సమస్య పరిష్కారానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను బండి సంజయ్ సమర్థించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story