vamana Rao couple murder case : సీబీఐకి గట్టువామనరావు దంపతుల హత్య కేసు
ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

మంథనిలో నడి రోడ్డుపై హత్యకు గురైన లాయర్ గట్టు వామనరావు దంపతుల కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. గట్టువామనరావు హత్య కేసు సీబీఐకి అప్పగించాలని గట్టు వామనరావు తండ్రి గట్టు కిషన్రావు వేసిన పిటీషన్ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశించింది. తన కొడుకు, కోడలి హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లయర్ దంపతుల హత్య కేసు పునర్విచారణ చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పిటీషనర్ గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. 2021వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన గట్టు వామనరావు దంపతులు మంథని పట్టణంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా హత్యకు గరయ్యారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వీడియో అప్పట్లో అన్ని టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యి సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తాజాగా కిషన్ రావు పిటీషన్ని విచారించిన జస్టిస్ ఎంఎంసుందరేశ్, జస్టిస్ ఎస్కేసింగ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసును సీబీఐకి అప్పగించేందకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీనియర్ అడ్వకేట్లు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు పిటీషనర్ తరపున సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
