Gold shop robbed at gunpoint at Hyderabad : నగరంలో కాల్పుల కలకలం
తుపాకీలతో బెదిరించి జ్యువెలరీ షాపు దోపిడీ చేసిన దుండగులు

పట్టపగలు తుపాకులతో బెదిరించి చందానగర్లోని ఒక జ్యూవెలరీ దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీ దుకాణంలో ఈ సంచలన సంఘటన జరిగింది. దుకాణం తెరిచిన ఐదు నిమిషాలకే ఆరుగురు దుండగులు జ్యువెలరీ షాపులోకి చొరబడి గన్తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు షాపులో ఉన్న సీసీ కెమెరాలను కూడా తుపాకీతో పేల్చివేశారు. జ్యువెలరీ దుకాణం డిప్యూటీ మేనేజర్ కాళ్ళపై దోపిడీ ముఠా కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ల తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకీతో బెదిరించి దోపీడీకి పాల్పడ్డ ముఠా జహీరాబాద్వైపు పారిపోయారు. విషయంత తెలుసుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయి జిల్లా సరిహద్దులను అప్రమత్తం చేశారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఖజానా షోరూమ్ వద్దకు చేరుకుని ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనను సీరియస్గా తీసుకునన సైబరాబాద్ కమిషనర్ గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాల్పుల ఘటనపై షోరూమ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరుగురు దుండగులు షోరూమ్ లోపలికి వచ్చినట్లు సిబ్బంది కమీషనర్కి వివరించారు. గతంలో ముత్తూట్ ఫైనాన్స్లో చోరీకి పాల్పడిన ముఠా తరహాలోనే ఏమాత్రం జంకు లేకుండా ఖజానా షోరూమ్లో కూడా దోపిడీకి పాల్పడ్డారు. అయితే ఈ దోపిడీకి పాల్పడటానికి మొత్తం ఎంతమంది వచ్చారు. షోరూమ్లోకి వచ్చిన ఆరుగురు దుండగులు కాకుండా బయట ఎస్కేప్ టీమ్ ఎవరైనా ఉన్నారన్న విషయాలను నిగ్గు తేల్చడానికి స్థానికంగా ఉన్న ట్రాఫిక్ ససీసీ కెమారాలతో పాటు పలు వాణిజ్య సముదాయాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
