ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్
Good news for Indiramma House beneficiaries

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అందించే ప్రభుత్వ సహాయంపై ఆయన ఒక వీడియో సందేశాన్ని ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందనీ, ప్రతి లబ్ధిదారుడికీ 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామనీ, పైగా రూ.5 లక్షలను విడతల వారీగా మంజూరు చేస్తున్నామనీ మంత్రి తెలిపారు. ఇంటి నిర్మాణ పరిమాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపల ఉండాలని సూచించారు.
అంతేకాకుండా.. లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా అదనంగా లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుందని తెలిపారు. పది సంవత్సరాల విరామం తర్వాత ప్రజా పాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలవుతోందని, ఇది ప్రతి సామాన్య కుటుంబానికి ఆశాజ్యోతిలా మారిందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎలాంటి అంతరాయాలు లేకుండా తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
