District Reorganisation in Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధం
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధం

రాజధాని పరిధిలో కొత్త జిల్లా ఏర్పాటు.. పోలీస్ కమిషనరేట్లతో సమానంగా సరిహద్దులు
District Reorganisation in Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను ఇటీవల పునర్విభజించిన విధంగానే, గ్రేటర్ పరిధిలోని జిల్లాల సరిహద్దులను కూడా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాధమవుతోంది. కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల హద్దులకు అనుగుణంగా జిల్లాల పరిధులను సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో మూడు పోలీస్ కమిషనరేట్లు, మూడు జిల్లాలు ఉండగా.. నాలుగు కమిషనరేట్లుగా మారిన నేపథ్యంలో జిల్లాలను కూడా అదే విధంగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులపై వివరాలు సేకరిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి అనుగుణంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మార్పులు-చేర్పులు
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. వీటిలో తిరుమలగిరి, మారేడ్పల్లి మండలాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోకి చేర్చనున్నారు. అలాగే అమీర్పేట మండలంలోని బేగంపేట్ ప్రాంతాన్ని కూడా మల్కాజిగిరి జిల్లా భాగంగా చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా సరిహద్దు మండలాలుగా ఇప్పుడు బండ్లగూడ, బహదూర్పుర మండలాలు ఉండగా.. ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు జీహెచ్ఎంసీ పరిధి పరిమితంలో హైదరాబాద్ జిల్లాలోకి చేరనున్నాయి.
అబ్దుల్లాపూర్మెట్ మండలంపై నిర్ణయం పెండింగ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత మల్కాజిగిరి కమిషనరేట్ హద్దులకు అనుగుణంగా జిల్లా పరిధి విస్తరించనుంది. రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్, హయత్నగర్ మండలాలు మేడ్చల్ జిల్లాలో విలీనం కానున్నాయి. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ (రంగారెడ్డి జిల్లా), కంటోన్మెంట్ (హైదరాబాద్ జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి. అయితే అబ్దుల్లాపూర్మెట్ మండలం జీహెచ్ఎంసీ పరిధి దాటి ఉండటంతో దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రంగారెడ్డి జిల్లా.. రెండుగా విభజన
రంగారెడ్డి జిల్లా విస్తృత పరిధి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండటంతో దీన్ని అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా చేయనున్నారు. షాద్నగర్, శంషాబాద్ రూరల్, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాలో చేర్చనున్నారు.
2027 సెన్సస్కు ముందు ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలిపారు.

