Gutta Sukender Reddy: కవిత కొత్త పార్టీ ప్రకటనపై గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యలు: మనుగడ సవాలుగా మారుతుంది
మనుగడ సవాలుగా మారుతుంది

Gutta Sukender Reddy: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించిన విషయంపై స్పష్టత ఇచ్చారు. కవిత స్వయంగా వచ్చి విజ్ఞప్తి చేయడంతోనే ఆమె రాజీనామాను అంగీకరించినట్లు తెలిపారు. భావోద్వేగాలతో రాజీనామా చేసిన సందర్భాల్లో కొంత సమయం వేచి చూడటం సాధారణమని, కవిత విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించినట్లు వివరించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై కూడా స్పందించారు.
‘‘రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే పార్టీలు మనుగడ సాగించడం చాలా కష్టతరం. గతంలో ఏర్పడిన చాలా పార్టీలు కాలక్రమంలో అదృశ్యమయ్యాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఏ ప్రాతిపదికన జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. హిల్ట్ విధానం ద్వారా ఎలాంటి అవినీతి జరగదు. కాలుష్య నియంత్రణ కోసం పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం సరైనది కాదు’’ అని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.

