హరీష్ రావు మండిపాటు

Harish Rao : తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉందని, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీష్ రావు తన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.

“పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, ఫలితాల్లో అనుమానాలు, మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి, హడావుడిగా అవకతవకలకు పాల్పడిన రేవంత్ రెడ్డి నీవు ఈ తీర్పుకు ఏం సమాధానం చెబుతావు? నీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు బాధపడుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగాలు ఇవ్వడం అంటే చిల్లర రాజకీయాలు కాదు. రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా కళ్లు తెరుచుకో. నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలవంచు. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు,” అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. మెరిట్ లిస్ట్‌ను రద్దు చేయాలని, పేపర్లను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆదేశించింది. రీవాల్యుయేషన్‌కు ఎనిమిది నెలల సమయం ఇచ్చిన కోర్టు, మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story