విజిలెన్స్‌ విచారణలో తేల్చిన అధికారులు

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగిన సమయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌ను ఇబ్బంది పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యం పోస్ట్‌ చేసిన ఓ మెయిల్‌ సంచలనం సృష్టించింది.

అయితే, ఈ మొత్తం వ్యవహారం సీఎం రేవంత్‌ రెడ్డికి తెలియడంతో వెంటనే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. అయితే, విజిలెన్స్‌ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగడంతో హెచ్‌సీఏ దిగొచ్చింది. బాబ్బాబు.. ఇకపై ఇబ్బంది పెట్టబోమని, వేధింపులకు కూడా పాల్పడబోమని, అదనపు టికెట్ల కోసం ఒత్తిడి చేయబోమని వేడుకుంది. దీంతో, అప్పటికి మాత్రం విజిలెన్స్‌ సిబ్బంది సైలెంట్‌ అయిపోయారు. కానీ, సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు.. బాధ్యులను వదిలేది లేదని స్పష్టం చేయడంతో.. విజిలెన్స్‌ అధికారులు సీక్రెట్‌గా, మరింత లోతుగా విచారణ సాగించారు. ఈ ఎంక్వైరీలో అసలు విషయాలన్నీ బయటపడ్ఆయి. సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ పెద్దలు ఇబ్బందుల పాలు చేశారని, వాళ్లను వేధించారని, కేటాయించిన కోటా కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చుక్కలు చూపించిందని బట్టబయలయ్యింది. మొత్తం ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావుతో పాటు. కార్యదర్శి కూడా ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఈ విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. అంతేకాదు.. ఈ చర్యలకు పాల్పడిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేశారు.

నిబంధనల ప్రకారం 10 శాతం టికెట్లు కేటాయించగా.. మరో పది శాతం టికెట్లు అదనంగా కావాలంటూ సన్‌రైజర్స్‌పై హెచ్‌సీఏ ఒత్తిడి చేసినట్లు విజిలెన్స్‌ విచారణలో బట్టబయలయ్యింది. ఇక, కాంప్లిమెంటరీ బాక్స్‌ టికెట్ల విషయంలోనూ తమకు వచ్చే వాటా ఇవ్వలేదంటూ.. జగన్‌ మోహన్‌ రావు కక్ష సాధింపులకు పాల్పడినట్లు తేలింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వీఐపీ బాక్స్‌లకు హెచ్‌సీఏ తాళం వేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామం తర్వాతే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాసింది. ఆ లేఖ బయటికి రావడంతో వివాదం బాహాటమయ్యింది. అయితే, విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు పరస్పరం చర్చలు జరిపాయి. సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వయిరీ పూర్తి కావడం, అప్పటి వాస్తవాలు బట్టబయలు కావడంతో మరోసారి ఈ వివాదం సంచలనంగా మారింది. జగన్మోహన్‌రావు గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత దగ్గర వ్యక్తి అని, అప్పట్లోనే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా నియమితుడయ్యాడన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా.. అతని వ్యవహార శైలిపై మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో జగన్మోహన్ రావుపై రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.


Politent News Web4

Politent News Web4

Next Story