అలా వెళ్లారు.. ఇలా వచ్చారు - కమిషన్ ముందుకు కేసీఆర్
he went.. and came like this - KCR before the commission

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్ నుంచి బయలుదేరిన కేసీఆర్ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి నేరుగా బీఆర్కే భవన్కు చేరుకున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. కేసీఆర్తో పాటు.. ఆరుగురు నాయకులకు విచారణకు హాజరయ్యేందుకు కమిషన్ అనుమతించింది.
అయితే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి విచారణకు హాజరు అవుతున్నందున సాయంత్రం వరకూ కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, కేవలం 50 నిమిషాల్లోనే కేసీఆర్ విచారణ పూర్తయ్యింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు వన్ టూ వన్ విచారణ కొనసాగింది. తనకు జలుబుతో పాటు.. స్వల్ప అనారోగ్యం ఉందని కేసీఆర్.. కమిషన్ చైర్మన్ చంద్రఘోష్కు తెలిపారు. అనారోగ్యం కారణంగా తనను ఓపెన్ హాల్లో ఫేస్ టూ ఫేస్ విచారణ కాకుండా.. వ్యక్తిగతంగా వన్ టూ వన్ ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. దీంతో, కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీ చంద్రఘోష్ ఓపెన్ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపించి.. ఆ తరువాత విచారణను కొనసాగించారు. మధ్యాహ్నం కేసీఆర్ కమిషన్ కార్యాలయానికి వెళ్లిన కాసేపటికే ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ముగిసింది. విచారణ ముగియగానే కమిషన్ కార్యాలయం నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కమిషన్ నియమించింది. గడిచిన 14 నెలల నుంచి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులను, ఇతర ప్రముఖులను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వారి స్టేట్మెంట్లు స్వీకరించింది. వాళ్ల స్టేట్మెంట్లు ఆధారంగా కేసీఆర్ను 18 ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ను 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక దగ్గర నుంచి తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా కేసీఆర్ను కమిషన్ ప్రశ్నలు అడినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ నిర్ణయం ఎవరిదిని అడగ్గా.. కేసీఆర్ రీ-ఇంజినీరింగ్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారంటున్నారు. అలాగే, బ్యారేజీలు నిర్మించడానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మించిన ప్రతి బ్యారేజీకి అన్ని అనుమతులు తీసుకున్నామని, వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చినట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధుల సమీకరణను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ను శర వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఉపయోగపడిందని కూడా కేసీఆర్ చెప్పారంటున్నారు. అదేవిధంగా బ్యారేజీలో నీటీ నిల్వ గురించి, బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పుల గురించి కేసీఆర్ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన జీవో నెం.45 తో పాటు.. పలు కీలక పత్రాలను కేసీఆర్ కమిషన్కు అందజేసినట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పుస్తకాన్ని కూడా కమిషన్ చైర్మన్ పీ చంద్రఘోష్కు కేసీఆర్ అందజేశారు.
విచారణలో భాగంగా.. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను ఆయన కమిషన్ చైర్మన్ పి చంద్రఘోష్కు అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ బయటకు వచ్చి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి నేరుగా ఎర్రవెల్లి ఫామ్హౌస్కు వెళ్లిపోయారు.
