Komatireddy : కాంగ్రెస్ లో సీయం ఎవరనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- కాంగ్రెస్ పార్టీని సొంత సామ్రాజ్యాలుగా చేసుకోవాలని చూస్తే సహించం
- సీయం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అటాక్
రాబోయే పది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటనని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపాయి. గడచిన సంవత్సరంన్నర కాలంలో సీయం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భంలేదు. కానీ నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పదేళ్ళు నేనే సీయంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్న మాటలపై కాంగ్రెస్ పార్టీకే చెందిన శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మండిపడ్డారు. ఆయనకు మంత్రి పదవి దక్కపోవడం గురించి కానీ, పలు ప్రభుత్వ విధానాలపైన కానీ ఇంతకాలం పరోక్షంగా విమర్శలు చేసిన రాజగోపాలరెడ్డి ఈ సారి డైరెక్ట్ గానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అటాక్ చేశారు. పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి తనకు తానుగా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్ర స్ధాయిలో కౌంటర్ ఇచ్చారు. తన ఎక్స్ సామాజిక మాధ్యమ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్పందించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని రాజగోపాలరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైనా వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తే నిబద్దత కలిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.
