ప్రభుత్వభూమి ఆక్రమణపై ఎమ్మెల్యేల పిల్ - హైడ్రాకు హైకోర్టు నోటీసులు
High Court notices to Hydra onMLAs' PIL on encroachment of government land

హైదరాబాద్లోని అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ ఏకంగా ఎమ్మెల్యేలే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై అక్రమాలకు అవకాశం ఇచ్చారంటూ ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు పిల్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించారన్నారు. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. భూమి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
2023లోనే ఈ స్థలాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ఓసీ జారీ చేశారని, దీంతో, జీహెచ్ఎంసీ అధికారులు ఈ స్థలంలో నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారని ఎమ్మెల్యేల తరపు న్యాయవాది వాదించారు. ఆ స్థలంలో ఇప్పుడు ఎనిమిది భారీ టవర్లు నిర్మిస్తున్నారని, ఒక్కో టవర్లో 47 అంతస్తుల దాకా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ నిర్మాణాల కోసం ఓ ప్రైవేటు స్కూల్కు కేవలం 150 మీటర్ల దూరంలోనే రెడీ మిక్స్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా పర్యావరణ కాలుష్యం విద్యార్థులపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు. ఆక్రమణకు గురైన ఈ ప్రభుత్వ స్థలాలు స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఎమ్మెల్యేల తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వ విభాగాలకు నోటీసులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రాకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
