Hyderabad as a city of flyovers

త్వరలో మరో మూడు ఫ్లై ఓవర్లు


హైదరాబాద్‌లో ఎన్ని డైవర్షన్లు అమలు చేసినా, ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా, ఎంఎంటీఎస్‌కు తోడు.. మెట్రో అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం తీరడం లేదు. రోజురోజుకూ ట్రాఫిక్‌ కష్టాలు పెరుగుతున్నాయే గానీ, తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో, ప్రభుత్వం కూడా రోజు రోజుకూ ఫ్లై ఓవర్ల సంఖ్య పెంచుతూనే ఉంది. ఓవైపు.. కొత్తగా రెడీ అవుతోన్న ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తూనే.. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఫ్లై ఓవర్లకు ప్రతిపాదనలు రూపొందిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



హైదరాబాద్‌లో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌-సిటీ)ని ప్రారంభించింది. దీనిలో భాగంగా నగరం మొత్తం మీద 16 ప్రాంతాల్లో 20.14 కిలోమీటర్ల మేర రూ.2400 కోట్లతో కొత్తగా బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, రహదారుల విస్తరణ పనులకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలోనే వీటి నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో విపరీతంగా రద్దీ ఉండే మూడు ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌లు నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ ఉంటున్న మూడు జంక్షన్లకు పరిష్కారం లభించనుంది. రేవంత్ ప్రభుత్వం హెచ్‌-సిటీ ప్రాజెక్టు కింద ప్రత్యేకంగా రూ.360 కోట్లతో మూడు ఫ్లైఓవర్‌లు, ఓ అండర్‌పాస్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిలో బంజారా హిల్స్‌ రోడ్డు నం.3లోని ది లీలా హోటల్‌ జంక్షన్, పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌)లో నిర్మాణం చేపట్టబోయే ఫ్లైఓవర్‌ల కోసం రూ.210 కోట్లు కేటాయించింది. అలాగే రసూల్‌పుర ఎన్టీఆర్‌ చౌరస్తాపై.. బేగంపేట మెయిన్ రోడ్డును, మినిస్టర్‌ రోడ్డును కలుపుతూ నిర్మించబోయే ఫ్లైఓవర్‌కు నిర్మాణానికి రూ.150 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు కూడా రూపొందించారు. వీటికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగానే.. టెండర్లు పిలుస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్లై ఓవర్లు అందుబాటు లోకి వస్తే.. ఇప్పుడు చెప్పుకున్న మూడు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇక, నాగార్జున సర్కిల్‌ చౌరస్తాలో నిర్మించబోయే ఫ్లైఓవర్ నిర్మాణం పొడవు 900 మీటర్లు. ఈ నిర్మాణ పనుల కోసం 13 ఆస్తులను సేకరించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఆ ఆస్తులను సేకరించాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుందంటున్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.1 నుంచి నాగార్జున సర్కిల్‌ మీదుగా రోడ్డు నం.3 వైపు వెళ్లే వాహనాల కోసం రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీని పొడవు 900 మీటర్లు. అలాగే పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్‌ రోడ్డు నం.3 మీదుగా శ్రీనగర్‌ కాలనీకి రెండు లైన్ల అండర్‌పాస్ రాబోతోంది. ఈ అండర్‌ పాస్‌ పొడవు 340 మీటర్లు. వీటితో పాటు కేబీఆర్‌ పార్కు నుంచి పంజాగుట్ట వైపు లీలా హోటల్‌ జంక్షన్‌ వద్ద మూడు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీని పొడవు 600 మీటర్లు. ఈ రెండు నిర్మాణ పనుల కోసం 46 ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డు వైపునకు వెళ్లే దారిలో.. ఎన్టీఆర్‌ జంక్షన్‌లో మెట్రో మార్గం మీదుగా ఫ్లైఓవర్‌ని నిర్మించబోతున్నారు. దీని పొడవు 740 మీటర్లు.. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం 8 ఆస్తులను సేకరించాల్సి ఉంది. దీనిపై.. జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ భూసేకరణపై క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేపట్టారు.


Politent News Web4

Politent News Web4

Next Story