Hydra: హైడ్రా: బంజారాహిల్స్లో భారీ ఆక్రమణలు తొలగింపు.. రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం!
రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం!

Hydra: బంజారాహిల్స్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన ఈ భూమిని అధికారులు కాపాడారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ ఆక్రమణలు జరిగాయి. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల్లో 1.20 ఎకరాలను జల మండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లు, వేట కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా, మొత్తం భూమిని తన అధీనంలోకి తీసుకొని, షెడ్లు నిర్మించాడు. ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని, భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు జల మండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఇక్కడ వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జల మండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. ఫేక్ సర్వే నంబర్ (403/52)తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే.. 403/52తో ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ క్లెయిమ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య శుక్రవారం ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణదారు వేసిన ఫెన్సింగ్తో పాటు లోపల ఉన్న షెడ్లను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.
