I answered all the questions asked by the commission - Etala Rajender

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, నాసిరకం నిర్మాణాల ఆరోపణలపై విచారణ సాగిస్తున్న కమిషన్‌ ముందు అప్పటి ఆర్థిక శాఖా మంత్రి, ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న అంశంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌తో విచారణ చేయిస్తుండగా.. కమిషన్‌ నోటీసులు జారీచేయడంతో ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీ ఘోష్‌ కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత.. ఈటల రాజేందర్‌ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.



కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినట్లు ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ విచారణ కమిషన్‌ తన రిపోర్టును వీలైనంత తొందరగా సమర్పించాలని, ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని ఈటల వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం ఉందా అని కమిషన్ అడిగిందన్నారు. అయితే, ఆ అంశాలపై తనకేమీ సంబంధం లేదని చెప్పానని ఈటల స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం నియమించిన కాళేశ్వరం కార్పొరేషన్‌పై ఆర్థిక మంత్రిగా తనకు అధికారం ఉండేదా? అని అడిగితే.. ఆ విషయంలో తనకు9 అలాంటి అధికారాలేవీ లేవని బదులిచ్చానన్నారు ఈటెల రాజేందర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నాణ్యత గురించి చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లదని చెప్పారు. అలాగే, ఆ సమయంలో కేసీఆర్ సీఎంగా వ్యవహరిస్తున్నప్పుడు మరో మంత్రి హరీష్ రావు నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారని ఈటల గుర్తు చేశారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ, సీడబ్ల్యుసీ నివేదిక ఆర్థిక శాఖ ముందు పెట్టారని వెల్లడించారు.



వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్తను తానే అంటూ కేసీఆర్ స్వయంగా అనేక సార్లు చెప్పుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నది కేసీఆరే అని, అప్పుడు సర్కారుకు ఆయనే బాస్‌ అని చెప్పారు. తన పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉంటున్నట్లు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానని చెప్పారు. తెలంగాణ సాధించుకున్నది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ ప్రాజెక్టును అప్పుడు తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాలని అనుకున్నప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. సీడబ్ల్యూసీ రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో మూడు బ్యారేజీలు కట్టారన్నారు.



ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తొలుత రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. ఆ వ్యయం ఆ తర్వాత.. రూ.82 వేల కోట్లకు చేరుకుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారని కమిషన్‌ ప్రశ్నించిందన్న ఈటల.. అసలు కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఆర్థిక శాఖకు సంబంధమే లేదని సమాధానం ఇచ్చానన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను వీలైనంత తొందరగా బయటపెట్టాలని.. అసలైన దోషులు ఎవరో సర్కారు తేల్చాలని.. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.





Politent News Web4

Politent News Web4

Next Story