BRS Working President KTR: నేను చెప్పిన విషయాలన్నీ తప్పు అని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

BRS Working President KTR: తెలంగాణ ఏర్పడిన తర్వాత పెట్టుబడుల సాధనలో బెంగళూరును కూడా అధిగమించినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పోరాటం వల్లే సాధ్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించిందని వివరించారు.
2014లో తెలంగాణలో సాగుభూమి 1.50 కోట్ల ఎకరాలు మాత్రమే ఉండగా, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 2.29 కోట్ల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. దశాబ్దకాలంలో సుసంపన్నమైన తెలంగాణను తీర్చిదిద్దామని, రాష్ట్ర పాలనలో తమ నాయకత్వ పటిమను నిరూపించామని కేటీఆర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చామని, ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా, రైతు బంధు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపామని గుర్తు చేశారు.
“నా మాటలన్నీ తప్పు అని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా”
నాలుగు కోట్ల ప్రజలను తన కుటుంబంగా భావించి పాలన చేశామని, ప్రస్తుతం తెలంగాణ వ్యతిరేకులు అధికారంలో ఉండటం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టిన వ్యక్తి పదవిలో ఉండటం బాధగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను తెలంగాణ ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, జాతీయవాదం గురించి పవన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

