Mp CmRamesh : నా జోలికి వస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా
కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు – సీయం రమేష్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి నేను కాంట్రాక్టులు పొందానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ సీయంరమేష్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఆరోపణలపై ఎంపీ సీయంరమేష్ స్పందాంచారు. అనకాపల్లిలోని ఎంపీ కార్యాలయంలో సీయంరమేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రిత్విక్ కంపెనీకి వచ్చిన 1660 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు సంబంధించి కేటీఆర్ నాపైన ఆరోపణలు చెయ్యడం ముర్ఖత్వమన్నారు. అసలు ఆ కంపెనీకీ నాకు సంబంధం లేదని సీయం రమేష్ స్పష్టం చేశారు. చెల్లితో పోరు కారణంగా కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని సీయంరమేష్ విమర్శించారు. తెలంగాణలో ఎల్అండ్టీకి, రిత్విక్ కంపెనీలకు కాంట్రాక్ట్ వర్క్లు వచ్చి మూడు నెలలు అయ్యిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తే ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు తెలియకపోవడం విడ్డూరమన్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో నా ఇంటికి వచ్చినప్పుడు ఏం మట్లాడావో గుర్తుందా అని కేటీఆర్ని ఎంపీ సీయం రమేష్ ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు నాతో చెప్పలేదా అని సియంరమేష్ కేటీఆర్ని నిలదీశారు. మీది అవినీతి పార్టీ అని తెలంగాణలో మీ పార్టీ పని అయిపోయిందని, మీతో మాకు పని లేదని నేను చెప్పడం వల్లే కేటీఆర్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని సీయంరమేష్ అన్నారు.
తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే మా పార్టీకి కమ్మ కొడుకులు అవసరం లేదని. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా? అని సీయంరమేష్ కేటీఆర్ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి టిడిపి పొత్తుతో పని చేస్తాయని అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసే కేటీఆర్ ఇటువంటి నిరాధార ఆరోపణలు చూస్తున్నాడన్నారు. మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని దమ్ముంటే మీడియా ముందు చర్చిద్దామని సవాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అనవసరంగా నన్ను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ ను బీజేపీ ఎంపీ సీయంరమేష్ హెచ్చరించారు.
