• పాత.. కొత్త నేతల మధ్య సమన్వయం సాధించాలి…
  • ప్రభుత్వ పధకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి…
  • సీయం రేవంత్‌ రెడ్డికి మీనాక్షీ నటరాజన్‌ సలహా

కాంగ్రెస్‌ పార్టీలో పాత తరం నాయకులు… కొత్త తరం నాయకుల మధ్య కుమ్ములాటలు అధికమవుతున్నాయి. నూతన తరం నాయకులతో కాంగ్రెస్‌ పాత నేతలు మింగిల్‌ కాలేక పోతున్నారు. వీరిద్దరి మధ్యా అస్సలు పొసగడం లేదు. ఈ విధంగా అనుభవజ్ఞులు యువ నేతల మధ్య పరిస్ధితులు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఏఐసీసీ ఇన్‌ ఛార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ రాష్ట్రంలో విస్త్రతంగా పర్యటనలు చేసినప్పుడు ఈ అంతర్గత కుమ్ములాటలను పసిగట్టారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్ద కూడా మీనాక్షీ నటరాజన్‌ ప్రస్తావించి దీనికి పరిష్కారం వెతకమని సూచించారు.

గత పది రోజులుగా తెలంగాణలో మకాం వేసిన మీనాక్షీ నటరాజన్‌ పార్టీ స్ధితిగతులతో పాటు ప్రభుత్వ వ్యవహారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. పార్టీ నేతలతో వరుస భేటీలు వేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. ఉమ్మడి జాల్లాల చొప్పున పది మంది అబ్జర్వర్లను నియమించుకుని వారి ద్వారా ప్రతి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. వారు చెప్పిన సమస్యలు, సూచనలను మీనాక్షి నోట్ చేసుకున్నారు. గడచిన పది రోజులుగా క్షేత్ర స్ధాయి నుంచి మీనాక్షీ నటరాజన్‌ సేకరించిన సమాచారాన్నంతా సేకరించి సీయం రేవంత్‌ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక విషయాలను మీనాక్షి సీయంతో చర్చించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పది రోజులుగా మాట్లాడిన విషయాలను, వారి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ని సీయం రేవంత్ రెడ్డికి వివరించారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు విపరీతంగా ఉన్నాయని, నేతలు ఒకరి మీద ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని సీయం దృష్టికి తీసుకువెళ్ళారు. కొత్తగా కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి పదవుల్లో ఉన్న నేతల వల్ల పాత తరం కాంగ్రెస్ నేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని సీయంకి చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరులో పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారని సీయంకి చెప్పారు. చాలా నియోజకవర్గాల్లో సోషల్‌ మీడియా టీమ్‌ లు బలహీనంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో విఫలమవుతున్నామన్నారు. ఈ సమస్యలన్నింటికి వెంటనే పరిష్కార మార్గాలు వెతకాలని మీనాక్షీ నటరాజన్‌ సీయం రేవంత్‌ రెడ్డికి సూచించారు. ప్రధానంగా ప్రభుత్వ పధకాలు ప్రజల్లోకి చేరేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సీయంని కోరారు.

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమన్నారు సీఎం రేవంత్. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినేట్‌లో సమీక్ష చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story