తెలంగాణ రాజకీయాలు కొద్దిరోజులుగా కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కూతురిగానే కాకుండా.. ఆమె పార్టీకి భిన్నంగా సొంత శైలిలో ముందుకు కదులుతున్న తీరు చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం పరిభ్రమిస్తోంది. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం.. కవితకు ఇంతటి ప్రాధాన్యత ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నారట. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన క్షణం నుంచీ మీడియా మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయంలో కూడా కవితకు అత్యంత ప్రాధాన్యత లభించింది.
బంజారాహిల్స్లోని కవిత ఇంటి సమీపంలో వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పడుు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. యోధుడి కుమార్తెకు భయమన్నదే లేదు అన్న క్యాప్షన్తో ఉన్న ఫ్లెక్సీ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫ్లెక్సీ చుట్టూ గులాబి జెండాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. ఇక ఆ ఫ్లెక్సీలలో కవిత తెలంగాణ బొగ్గుగని కార్మికుల కమిటీ కండువా ధరించి ఉన్న ఫొటో ఉంది. ఇప్పుడీ ఫ్లెక్సీల చుట్టూనే చర్చ నడుస్తోంది. కవిత రాజకీయ అడుగులు ఎటు అన్న చర్చ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వంటి అంశాలను కూడా మరుగున పరిచేసిందని పరిశీలకులు అంటున్నారు. కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ తరువాత జరిగిన పరిణామాలు ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడం ఖాయమన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన, ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు కానీ, బీఆర్ఎస్ జెండా కానీ లేదు. అయితే కేసీఆర్, జయశంకర్ ఫొటోలు మాత్రం ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె తాజాగా ప్రారంభించిన జాగృతి కార్యాలయమే ఒక వేళ ఆమె రాజకీయ పార్టీ ప్రారంభిస్తే.. ఆ పార్టీ కార్యాలయంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఇక్కడే ఒక సందేహాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్కు దూరంగా వేస్తున్న రాజకీయ అడుగుల వెనుక ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందా అన్నదే ఆ సందేహం. మామూలుగా అయితే కవిత తీరు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కు స్పష్టమైన హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఆమె బాహాటంగానే తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో కేసీఆర్ను దేవుడిగా అభివర్ణించారు.
ఇప్పుడు కవిత తన సొంత పార్టీని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? తమిళనాడులో డీఎంకే, ఏఐఏడిఎంకేలా బీఆర్ఎస్ రెండుగా నిట్టనిలువుగా చీలిపోతుందా? బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలను కవిత తన వైపునకు తిప్పుకోగలరా? అంటే ఆమెకు అంత సీన్ లేదన్న సమాధానమే అన్ని వర్గాల నుంచీ వస్తోంది. అయితే తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకేలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు అవకాశం, చోటు లేకుండా చేశాయి. ఇప్పుడు కవిత వేరుకుంపటి కూడా అలాంటి వాతావరణం సృష్టించడానికేనా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అదే కారణమై ఉంటే మాత్రం కవిత అడుగుల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిని నిర్వహించేంత స్థాయి కవితకు లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ యోచన, ప్రయత్నాల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.
