విజయ దివస్‌ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించిన టీబీజేపీ

దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించేందుకు వీరమరణం పొందిన అమరవీర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అన్నారు. జూలై 26 కార్గిల్‌ విజయ దివస్‌ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో హైదారబాద్‌లో ఆయన కార్యకర్తలతో కలిసి వీరజవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999లో కార్గిల్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారనొ ఇది భారతదేశంపై పాకిస్తాన్ చేసిన ఘోరమైన కుట్రగా రామచంద్రరావు అభివర్ణించారు. ఈ దాడిని భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొందని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారత సైన్యం ఓ మహత్తర విజయాన్ని సాధించిందన్నారు. శత్రువులను తిప్పికొట్టి, కార్గిల్ లోని భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. వారి ధైర్యం, వీరత్వం ఎప్పటికీ మరువలేమన్నారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మళ్లీ ఒకసారి భారత వీరజవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో చిన్నపిల్లలు కూడా పాల్గొంటూ దేశభక్తిని చాటుకుంటున్నారన్నారు. భారత సైన్యం చేసిన త్యాగానికి గుర్తుగా, మనం జరుపుకుంటున్న కార్గిల్ విజయ దినోత్సవం భారత సైనిక వీరత్వానికి నిదర్శనం. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లు, వైమానిక దాడులు, ఇతర ఆపరేషన్‌లు— ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే అని టీబీజేపీ అధ్యక్షుడు చెప్పారు. పాకిస్తాన్ మళ్లీ మామూలుగా దాడి చేయగలిగే స్థితిలో లేదు. కానీ పరోక్షంగా ఉగ్రవాదుల ద్వారా భారత్‌పై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కానీ ఈ దేశం ఇప్పుడు మారిపోయింది. సైనికులే కాదు ఈ దేశపు ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story